శ్రీ సాయిసచ్చరిత్రము
మొదటిరోజు పారాయణము
గురువారము
ఉపోద్ఘాతము
ఇందులో శ్రీపాదశ్రీవల్లభస్వామి యొక్కయు, శ్రీనరసింహసరస్వతిస్వామి యొక్కయు లీలలును విచిత్రచర్యలును వర్ణింపబడియున్నవి. వీరిద్దరు దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాటీ గ్రంథకర్తయగు శ్రీ L.R.పాంగార్కర్ అభిప్రాయము ప్రకార మీ రెండవతారములు 14,15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి యవతారాములు కూడ గలవు . ఇందులో ముఖ్యమైనవి నైజాము ఇలాఖాలో శ్రీమాణిక్యప్రభువును, షోలాపూరు జిల్లాలో శ్రీఅక్కల్కోటకర్ మహారాజ్గారు, తుట్టతుదకు అహమదునగరు జిల్లాలోని శిరిడీలో శ్రీసాయిబాబాయును. బాబా1918 వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. శ్రీఅక్కల్కోటకర్ మహరాజ్ ఆవతార పరంపరయే శ్రీసాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకము. అయిదవ యధ్యాయములో వేపచేట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, ఇరువదియారవ యధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్రపితళే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. ఫైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీగురుచరిత్ర మను గ్రంధమందు 53 అధ్యాయములలో సరస్వతీ గంగాధరు డెట్లువర్ణించెనో, యటులనే శ్రీ గోవిందరఘునాథ్ ఉరఫ్ అన్నాసాహెబు దాభోళ్కరు ('హేమడ్పంతు') అనువారు శ్రీసాయిలీలలను 53 అధ్యాయములలో శ్రీసాయిసచ్చరిత్రమ ను గ్రంథమును వర్ణించియున్నారు. కనుక నీ శ్రీసాయిసచ్చరిత్రము యీనాటి 'గురుచరిత్ర' యని చెప్పవచ్చును!.
ఫై చరిత్రల గూర్చి ఈ దిగువ వివరించిన ఆంశములు గమనార్హములు:
1..శ్రీ గురుచరిత్రను వ్రాసినవారు కన్నడమువారు కాబట్టి, వారికి మరాటీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికి వారి ఇష్టదైవము యోక్క ఆశీర్వాదము వల్ల మరాటీ భాషలో ప్రసిద్దికెక్కిన గొప్ప గ్రంధమును వారు వ్రాయగలిగిరి. శ్రీసాయిసచ్చరిత్రము యొక్క గ్రంధకర్త సుప్రసిద్ధ మారాటీవారు. వారు మహారాష్ట్ర దేశములోని యనేక యోగుల చరిత్రలను చదివియున్నారు. ప్రసిద్ధిచెందిన ఏకనాథ భాగవతము వారి నిత్యపారాయణ గ్రంథము . శ్రీసాయిసచ్చరిత్రము ను జాగ్రత్తగా చదివినిచో, ఏకనాధ బాగవతము లోని పెక్కు విషయములు శ్రీసాయిసచ్చరిత్రములో పొందుపరచబడియుండుట చూడగలరు.
2. శ్రీ గురుచరిత్రను ముఖ్యముగా కర్మకాండఫై నాధారపడి యుండుటచే దానిని బోధపరచుకొనుట బహుకష్టము . దాని నాచరణలో బెట్టుట మఱింత కష్టము. దత్తాత్రేయుని ముఖ్యశిష్యులు గూడ దాని నాచరణలో పెట్టలేకున్నారు. శ్రీసాయిసచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి . ఇందులో చెప్పినవానిని అందరు సులభముగా గ్రహించి యాచరణలో పెట్టగలరు.
3.శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నురేండ్లకు వ్రాయబడెను . కాని శ్రీసాయిసచ్చరిత్రము లోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీసాయిబాబా యొక్క యనుమతి పొంది, వారి యాశీర్వాదముతో ఈ గ్రంధమును ప్రారంభించెను . వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసియుంచుకొనెను. 1918 వ సంవత్సరములో సాయిబాబా సమాధిచెందిన తరువాత, శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీసాయిచరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించెను.శ్రీ సాయిసచ్చరిత్ర మీవిధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయిలీల లో ధారవాహికముగ ప్రచురింపబడి, 1930 లో పూర్తిగ్రంథరూపముగ ముద్రింపబడినది. కనుక శ్రీసాయిసచ్చరిత్రమును ప్రస్తుత గ్రంధము అధికారిమైనది. శిరిడిలో శ్రీసాయిబాబా సశరీరులుగా యుండగా దర్శించుకొను భాగ్యము లభించని సాయిభక్తులకు యీ గ్రంధము నిజముగా యొక వారము.
శ్రీ సాయిసచ్చరిత్రము ను అన్నాసాహెబు దాభోళ్కరు కూర్చెను. కాని, ప్రతి ఆధ్యాయము చివరను శ్రీసాయి ప్రేరేపణచే 'హేమడ్పంతు' చే వ్రాయబడినట్లున్నది .కావున ఈ హేమడ్పంతు ఎవరిని పాఠకులడుగవచ్చును. అన్నాసాహెబు దాభోళ్కరు మొట్టమొదటిసారి శ్రీసాయిబాబాను సందర్శించినప్పుడు, వారీ బిరుదును దాభోళ్కరుకు కరుణించిరి. ఎప్పుడు ఏ సందర్బములో నీ బిరుదునతనికి నొసంగిరో యను విషయము రెండవ అధ్యాయములో రచయితయే చెప్పియున్నారు. అన్నాసాహెబు జీవితచరిత్ర యీ దిగువ క్లుప్తముగా చెప్పబడినది.
గ్రంధరచయిత యగు దాభోళ్కరు 1859వ సంవత్సరములో ఠాణాజిల్లాలోని కెళ్వేమాహిమునందు యొక పేద అద్యగౌడబ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తిగలవారు. దాభోళ్కరు తమ ప్రాధమికవిద్యను స్వగ్రామమందే పూర్తిచేసి, పూనాలో 5 వ -స్టాండర్డు వరకు ఆంగ్లవిద్యనభ్యసించిరి. కుటుంబ ఆర్థికపరిస్తితులంత బాగుగా నుండకుండుటచే వారు ఫై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లో నున్న సర్కారు నవుకరి పరీక్షలో నుత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగములో ప్రవేశించిరి. ఆ సమయమందు కులబా జిల్లాలో మామల్తదారుగా నున్న సాబాజీ చింతామణి చిట్ణీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్దికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాఠీయను గ్రమోద్యోగిగా నియమించిరి. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట మామల్తదారు కచేరిలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలము జరిగిన పిమ్మట అటవిశాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్ళకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్ లోని బ్రోచ్ లో నియమితులైరి . ఆయా ఉద్యోగములలో తన భాధ్యతలను అత్యంత సమర్ధవంతముగా నెరవేర్చుట వలన 1901-వ సం || లో ఠాణా జిల్లాలోని శహాపూరులో మామల్తదారుగా నియమింపబడిరి. వారచ్చట 1907 వరుకు ఉద్యోగము చేసిరి. తరువాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి,1910-వ సం || లో తిరిగి బాంద్రాలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా నియమితులైరి. ఈ సంవత్సరమందే వారికీ శిరిడీకి పోయి శ్రీసాయిసందర్శనము చేయు భాగ్యము కలిగెను.
1916-వ సం || లో వారు ఉద్యోగవిరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి. ఆదియును విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందువరకు శ్రీసాయిసేవేలోనే పూర్తిగా నిమగ్నులయిరి . బాబా మహాసమాధి పిమ్మట షిర్డీ శ్రీసాయిబాబా సంస్థానమును, 1929-సం || లో తాను మరణించువరకును, ఎంతో చాకచక్యముగా నడిపిరి. వారికి భార్య, ఒక కుమారుడు, అయిదుగురు కుమార్తెలుండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినివి. అందరు క్షేమముగా నున్నారు.
సాయిబాబా యెవరు ?
సాయిబాబా ఎవరు? -- అను ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును .
1. దీర్ఘాలోచన చేయకయే, విషయములగూర్చి గాని, మనుష్యులను గూర్చి గాని యభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబానొక పిచ్చి ఫకీరనియు, వారు శిరిడిలో శిధిలమై పాడుపడిన మసీదులో ననేక సంవత్సరములు నివసించిరనియు, ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు, తమను దర్శింప వచ్చినవారి నుంచి దక్షిణరూపముగా ధనము వసూలు చేయుచుండిరనియు చెప్పుదురు.
ఈ యభిప్రాయము తప్పు! ఆర్.ఎ.తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము , బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునపుడు కంటతడి పెట్టుకొనెను . అతనితో బాబా ఇట్లనెను, " పిచ్చివానివలె ప్రవర్తించుచున్నావేమి ? నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? "దానికి తర్ఖడ్ గారి మిత్రుడిట్లు జవాబిచ్చెను: "నాకా విషయము తెలియదు . ఎందుకనగా, మీరు బొంబాయిలో నాతో నున్నట్లు నా కనుభవము లేదుగదా!" అందులకు బాబా ఇట్లనియెను: "ఎవరయితే బాబా శిరడిలో మాత్రమే యున్నాడని యనుకొందురో వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో!"
2..కొందరు సాయిబాబాను మహాసిధ్ధపురుషుడనిరి. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి . హిందువులు బాబాను తమ మహాత్ములలో నొకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము శిరిడిలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను 'సంతచూడామణి' గా పేర్కొనెదరు.
ఈ యభిప్రాయము కూడ సరియైనది కాదు!
3.శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను, వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా నిప్పటికిని భావించుచున్నారు. దీనికీ దిగువ కొన్ని ద్రుష్టాంతముల నిచ్చెదము .
1.బి.వి. నరసింహస్వామిగారు రచించిన 'బాబా సూత్రములు - పలుకులు ' అను గ్రంధమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారగు యమ్.బి. రేగేగారు ఇట్లు వ్రాసి యున్నారు: "బాబా సశరీరులుగయున్నపుడు, వారొక రూపుదాల్చిన బగత్స్వరూపముగ తమ భక్తులకు భాసిల్లుతూ, తమ లీలాప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని, దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము నిప్పటికిని అనంతశక్తివలె నిలిచి, వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు యసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు."
2.శ్రీబి.వి.నరసింహస్వామిగారు రచించిన 'భక్తుల యనుభవములు' అను పుస్తకములోని మొదటి పేజీలో ఉత్తరభారతదేశములో నున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసియున్నారు.
"నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారుడుగా భావించెదను. 1918 వ సం|| లో వారు సమాధి చెందకముందు నేనట్లు భావించితిని. ఇప్పటికి నేనట్లే భావించుచున్నాను . నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో, వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య యున్నప్పుడు వారి మానవశరీరము మా కనుల ముందు సంచరించుచుండెను.ఒక్కోక్కప్పుడది మాదృష్టిని విశేషముగ నాకర్షించెడిది. కాని, ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్త్వమే. శాశ్వతము - అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక మానసికప్రతిబింబమువాలే వారు మాకు భాసించేవారు. అశాశ్వతమైన తమ మానవదేహము నొక్కొక్కప్పుడు మా ముందర తళుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై , 'సాయిబాబా' యను శాశ్వతమయిన అనంతశక్తి మాత్రము నిలిచియున్నది.
3. బి.వి నరసింహస్వామిగారిచే రచింపబడిన 'భక్తుల యనుభవములు' అను గ్రంధములో 19-20 పుటలలో ఆచార్య జి.జి. నార్కే, (యం.ఏ .యం.యస్.సి., పూనా ఇంజినీరింగు కాలేజీ ) యిట్లు చెప్పి యున్నారు:
"ఇంటివద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరినిగా నుంచితిని . సాయిబాబా భగవంతుడు . ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారగు శ్రీమాన్ బూటీ , నా బార్య , నా తల్లి గొప్ప సాయిభక్తులు. వారు సాయిబాబాను భగవంతునివలె పూజించువారు. నేను క్రొత్తగా శిరిడీకి పోయినప్పుడొకనాడు ఆరతి సమయములో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై యుండెను. ఆకారణముగా వారు కోపించుచు, శపించుచు, భయపెట్టుచుండిరి. అయన పిచ్చివాడా యేమను సంశయము నా మనస్సులో మెదిలెను. మామూలుగానే ఆరతి పూర్తియాయెను. ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలనునిమురుచు, 'నేను పిచ్చివాడను కాను!' అనెను. ఎంత యాశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండ మనము ఏ రహస్యములను దాచజాలము. వారు యంతర్యామి, నా యాత్మయొక్క యంతరాత్మయని నేననుకొంటిని. అటు పిమ్మట వారి యంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగెను. వారు నాతో మాట్లాడునప్పుడు నా హృదయములో కూర్చుండి, మాట్లాడువానివలె వారు. నా హృదయములోగల యాలోచనలను, కోరికలను గ్రహించుచుండెడివారు. వారు నాలో నున్న భగవంతుడు. వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరిక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు, వారి యిచ్ఛానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుచుండెను."
4. రావుబహుద్దూర్ యమ్.డబ్ల్యు . ప్రధాన్ వ్రాసిన 'శిరిడీ సాయిబాబా' యను గ్రంధమునుకు ఉపోద్ఘాతములో గౌరవనీయులును, అమరావతిలో ప్రసిద్దికెక్కిన వకీలును నగు దాదాసాహెబు ఖాపర్డే యిట్లు చెప్పియున్నారు:
"శ్రీసాయిబాబా ప్రతివారి యంతరంగమందు మెదలు ఆలోచనలన్నియు తెలిసిన వానివలె వుండి, వారి కోరికలు తీర్చుచు సుఖసంతోషములు కలుగజేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగచుండెను."
5.దాసగణు మహారాజు తమ 'స్తవన మంజరి' యను స్తోత్రము నందు సాయిబాబాను జగత్తుయొక్క సృష్టికర్తగాను నిర్మలమయిన యంతరాత్మగాను నిత్యశాంతమూర్తిగాను వర్ణించి యున్నారు.
6.హేమడ్పంతు శ్రీ సాయిసచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసరుచుండిన యొక వింతయోగిగా వర్ణించెను . కాని రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది , బాబాను భగవంతుడనియు, సాక్షాత్పరబ్రహ్మశ్వరూపుడనియు చెప్పియున్నారు .
7.శిరిడీ భక్తులందరు, ముఖ్యముగా మాధవరావు దేశపాండే వురఫ్ శ్యామా యనువారు బాబాకు మిక్కిలి భక్తులు; వచ్చిన భక్తులందిరితో కలిసిమెలిసి తిరుగువాడు. ఆయనెల్లప్పుడు బాబాను 'దేవా'యని సంభోధించువాడు.
ఈ భక్తులందరి యబిప్రాయములను అవధరించి, వారు చెప్పినదానిలోని యదార్థమును గ్రహించి శ్రీసాయి యవతారపురుషుడని భావించెదము గాక!
ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వఋషులు భగవంతుడు సర్వాంతర్యామి యను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహ సర్వవస్తు సముదాయమైన ప్రకృతి యంతయు భగవంతుని రచనయనియు, అది యంతయు నంతర్యామిచే, అనగా సర్వమును సృష్టించి పాలించెడి భగవంతునిచే, వ్యాపింపబడి యున్నదనియు వక్కాణించుచున్నవి. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన యుదాహరణము శ్రీసాయియే! ఈ శ్రీ సాయిసచ్చరిత్రము ను, సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంధములను చదివినవారు తప్పక యీ సత్యమును గ్రహించి, యదార్థమయిన శ్రీ సాయిని దర్శించగలరు!
శ్రీ సాయినాథాయ నమః
ఉపోద్ఘాతము
సంపూర్ణము
సంపూర్ణము
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి