4, జూన్ 2009, గురువారం

నాలుగవ అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః
శ్రీసాయిసచ్చరిత్రము
నాలుగవ అధ్యాయము

యోగీశ్వరుల కర్తవ్యము - పవిత్ర శిరిడీ క్షేత్రము - సాయిబాబా యొక్క రూపురేఖలు -
గౌలిబువాగారి వాక్కు - విఠల దర్శనము - క్షీరసాగారుని కథ - దాసగణు ప్రయాగాస్నానము -
సాయిబాబా అయోనిసంభవము - శిరిడీకి వారి మొదటి రాక - మూడు బసలు -
యోగీశ్వరుల
కర్తవ్యము

భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు. "ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పాందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు, యుగయుగములందు అవతరించెదను. "ఇదియే భగవంతుని కర్తవ్యకర్మ. భగవంతుని ప్రతినిధులగు యోగులు సన్యాసులు అవసరము వచ్చినపుడెల్ల అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారు తమకర్మలను మానునప్పుడు, శూద్రులు పైజాతులవారి హక్కులను అపహరించునప్పుడు, మతగురువులను గౌరవించక యవమానించునప్పుడు, ఎవరును మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని యనుకొనునప్పుడు, జనులు నిషిద్ధాహారములు మద్యపానముల కలవాటుపడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతములవారు తమలోతాము కలహించునప్పుడు, బ్రహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనదారాసంతానములే జీవిత పరమర్ధముగా భావించి మోక్షమర్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయకర్మలచే ప్రజలను సవ్యమార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభములవలె సహాయపడి, మనము నడువవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగనే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబయీ, నామదేవు, జానబాయి, గోరా, గోణాయీ, ఏకానాధుడు, తుకారాము, నరహరి, నర్సిబాయి, సజన్‌కసాయి, సాంవతమాలి, రామదాసు, మొదలుగాగల యోగులును, తదితరులును వేర్వేరు సమయములందుద్భువించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి. అట్లే సాయిబాబా గూడా సకాలమందు శిరిడీ చేరిరి.

పవిత్ర శిరిడీ క్షేత్రము

ఆహమదునగరు జిల్లాలోని గోదావరినది ప్రాంతములు చాలా పుణ్యతమములు, ఏలయన నచ్చట ననేక యోగులుద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీజ్ఞానేశ్వర్ మహారాజ్. శిరిడీ గ్రామము అహమదు నగరు జిల్లాలోని కోపర్‌గాం తాలుకాకు చెందినది. కోపర్‌గాం వద్ద గోదావరి దాటి శిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్ గాంవ్ వచ్చును. అచ్చటికి శిరిడీ కనిపించును. కృష్ణా తీరమందుగల గాణగాపురము, నరశింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రములవలె శిరిడీకూడ గొప్పగా పేరు గాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేఢ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢ మందు సమర్థరామదాసు, నర్సోబాచీవాడీయందు శ్రీనరసింహ సరస్వతీస్వామివార్లు వర్దిల్లినట్లే శ్రీసాయినాథుడు
శిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర మొనర్చెను.

సాయిబాబా రూపురేఖలు


సాయిబాబా వలననే శిరిడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా యెట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తుల కిల్లువంటివారు; ఉదారస్వభావులు; సారములోని సారాంశమువంటివారు; నశించు వస్తువులందభిమానము లేనివారు; ఎల్లప్పుడు ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు; భులోకమందుగాని, స్వర్గలోకమందుగాని గల వస్తువులందభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దమువలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి యమృతము స్రవించుచుండెను. గొప్పవారు, బీదవారు, వారికి సమానమే. వారు మానావమానాలను లెక్కించినవారు కారు. అందరికి వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి యుండెడివారు. ఆటలు గాంచెడివారు; పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితినుండి మరలువారు కారు. ఎల్లప్పుడు అల్లా నామము నుచ్ఛరించుచుండెడివరు. ప్రపంచమంతా మేలుకొనునప్పుడు వారు యోగానిద్రయందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి యంతరంగము లోతయిన సముద్రమువలె ప్రశాంతము. వారి యాశ్రమము, వారి చర్యలు ఇదమిత్థముగ నిశ్చయించుటకు వీలుకానివి. ఒకచోటనే కూర్చుండియున్నప్పటికిని ప్రపంచమందు జరుగు సంగతులన్నియు వారికి తెలియును. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందలకొలది కథలు చెప్పునప్పటికిని మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడు మసీదుగోడకు ఆనుకొని నిలుచువారు. లేదా, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండీ తోటవైపుగాని చావడివైపుగాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికిని సాధకునివలె నటించువారు. అణకువ నమ్రత కలిగి,యహంకారము లేక యందరిని ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా, శిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళంది ను వృద్ధి చేసెను. శిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసికొన్నవి. ఏలయన బాబా పవిత్రపాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైని వేసికొనగలిగినవి. శిరిడీ మావంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరము, బడరీకేదార్,నాసిక్,త్ర్యంబకేశ్వరము. ఉజ్జయిని , మహాబలేశ్వరము , గోకర్ణములవంటిదయినది. శిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణతంత్రము. అది మాకు సంసారబంధముల సన్నగిలచేసి యత్మసాక్షాత్కారమును సులభసాధ్యము చేయును. శ్రీసాయి దర్శనమే మాకు యోగాసాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణీ ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మాకోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మాపాలిట శ్రీకృష్ణుడుగ, శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగజేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు; నిరుత్సాహముగాని ఉల్లసాముగాని యెరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానందస్వరూపులుగా నుండెడివారు. శిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడదేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా, భక్తు లన్నిదేశములనుండి శిరిడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్‌రఖుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగేది యానందము శిరిడిలో దొరుకుచుండెడిది. ఇది యతిశయోక్తి కాదు. విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు.

గౌలిబువా అభిప్రాయము

95 సంవత్సరముల వయస్సుగల గౌలిబువా యను వృద్ధభక్తుడు ఒకడు పండరీయాత్ర ప్రతిసంవత్సరము చేయువాడు. ఎనిమిది మాసములు పండరీపురమందు, మిగత నాలుగు మాసములు -- ఆషాఢము మొదలు కార్తీకమువరకు(జులై - నవంబరు) -- గంగానది యొడ్డునను ఉండెడివాడు. సామాను మొయుటకొక గాడిదను, తోడుగా నొక శిష్యుని తీసికొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీయాత్ర చేసికొని శిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చెడివాడు. అతడు బాబాను మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ యిట్లనెడివాడు; "వీరు పందరీనాధుని యవతారమే! అనాధల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి!" గౌలిబువా విఠోబాదేవుని ముసలిభక్తుడు. పండరీయాత్ర యెన్ని సారులో చేసెను. వీరు సాయిబాబా పందరీనాధుని యవతారమని నిర్ధారణ పరచిరి.

విఠలదేవుడు దర్శనమిచ్చుట

సాయిబాబాకు భగవన్నామస్మరణయందును, సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు ' అల్లా మాలిక్' -- అనగా, 'అల్లాయే యజమాని' -- అని యనుచుండెడివారు. ఏడు రాత్రింబగళ్ళు భగన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదనని దాసగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేడి, "తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని, భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీ పురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము, ఇక్కడనే -- యనగా శిరిడీలోనే -- యున్నవి. ఎవరును ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే యున్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే యవతరించును" అనెను.

సప్తాహము మునిగిన పిమ్మట విఠలుడీ క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా కాకాకు బాబా యిట్లడిగెను. "విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని జూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృడముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును." ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు 25,30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని జూచి బాబామాటలు జ్ఞాపకమునకు దెచ్చుకొని, కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటము నొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను.

భగవంతరావు క్షీరసాగారుని కథ

విఠలపూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగారుని కధలో విశదీకరింపబడినది. భగవంతురావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీ పురమునకు నియమముగ యాత్ర చేయుచుండెడివాడు. ఇంటివద్ద కూడా విఠోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు శిరిడీ వచ్చినప్పుడు, బాబా వాని తండ్రిని జ్ఞప్తికి దెచ్చుకొని; "వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చటకు ఈడ్చుకొని వచ్చితిని. వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మాడ్చినాడు. అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని. వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించునట్లు చేసెదను," అనిరి.

ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము

గంగానది యమునానది కలియుచోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచటికి పోయి స్నానమాడుదురు. దాసగణు కుడా ప్రయాగ పోయి అచ్చట సంగమములో స్నానము చేయవలెనని మనస్సున దలచెను. బాబా వద్దకేగి యనుమతించమనెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. " అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ యిచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము." ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటె నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణు మహారాజ్ బాబా పాదములపై శిరస్సునుంచిన వెంటనే బాబా రెండుపాదముల బొటన వ్రేళ్ళనుండి గంగాయమునా జలములు కాలువలుగా పారెను. ఈ చమత్కారమును చూచి
దాసగణు ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో వుప్పొంగిన కవితావేశం శ్రీసాయీలీలాగానరూపంలో పెళ్లుకుబికింది.

బాబా అయోనిసంభవుడు;శీరిడీ మొట్టమొదట ప్రవేశించుట

సాయిబాబా తల్లిదండ్రులను గూర్చిగాని, జన్మము గూర్చిగాని జన్మస్థానమును గూర్చిగాని యెవరికి ఏమియు తెలియదు. ఎందరో పెక్కుసారులీ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లీ విషయముగ బాబాను ప్రశ్నించిరి గాని, యెట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు, సమాన్యమానవులవలె జన్మించియుండలేదు. ముత్యపుచిప్పలలో చిన్న పాపలవలె లభించిరి. నామదేవుడు భీమారధి నదీతటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరధీనదీతటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా ప
దునారేళ్ళ బాలుడుగా శీరిడీలోని వేపచెట్టు క్రింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గాన్పించెను. బాబా స్వప్నావస్థయందయినను ప్రపంచవస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్‌దారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. "ఈ చక్కని చురుకైన కుఱ్ఱవాడు వేపచెట్టుక్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక యంతటి చిన్న కుఱ్ఱవాడు కఠినతపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్ధులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసెడివాడు కాదు. రాత్రియందెవరికి భయపడువాడు కాడు. చూచినవారాశ్చర్య నిమగ్నులై యీ చిన్నకుఱ్ఱ వాడెక్కడనుండి వచ్చినాడని యడుగసాగిరి. అతని రూపు, ముఖలక్షణములు చాల అందముగా నుండెను. చూచినవారేల్లరు ఒక్కసారిగా ముగ్దులగుచుండిరి. ఆయన ఎవరి యింటికి పోకుండెను, ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్నబాలునివలె గాన్పించినప్పటికిని చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన యాతని గూర్చి యెవరికి నేమి తెలియకుండెను." ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా నీ బాలు డెవడయి యుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రు లెవరని, ఎచ్చటినుండి వచ్చినాడని యడిగిరి. ఆ ఖండోబా గాణము యొక స్థలమును చూపి, గడ్డపారను దీసికొని వచ్చి యచ్చట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు. వాని దిగువ వెడల్పు రాయి యొకటి గాన్పించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు గాన్పించెను. అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను. ఆసొరంగము ద్వారా ముందుకుపోగా నచ్చట నొక భూగృహము కాన్పించెను. అందులో గోముఖ నిర్మాణములు, కఱ్ఱబల్లలు, జపమాలలు గాన్పించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు నభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుఱ్ఱవాని నీ విషయము ప్రశ్నించగా, వారలను మరపించుచు అది తన గురుస్ధానమనియు, వారి సమాధి యచ్చట గలదు గావున దానిని కాపాడవలెననియు చెప్పెను. వెంటనే దాని నెప్పటివలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షములవలె నీ వేపచేట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. మహాల్సాపతి తదితర శిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగనమస్కారములు చేసెదరు.

మూడు వసతిగృహములు

వేపచేట్టును, దాని చుట్టునున్న స్థలమును హరివినాయక సాఠే అనువాడు కొని సాఠేవాడాయను నొక పెద్ద వసతిగృహమును గట్టించెను. అప్పట్లో శిరిడీకి పోయిన భక్తమండలికిది యోక్కటియే నివాసస్థలము. వేపచెట్టు చుట్టు ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరాభిముఖముగా కుర్చొనెదరు. ఎవరిచ్చట గురుశుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృపవల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడా చాల పురాతనమైనది. కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానమువారు చేసిరి.

కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గ్రహము కట్టబడినది. న్యాయవాదియైన కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను. అచ్చట రైలు ప్రమదమున కాలు కుంటుపడెను. అది యెంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబు చాందోర్కరు శిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా యిచ్చెను. 1909 వ సంవత్సరమున కాకా శిరిడీకి బోయెను. బాబా దర్శనమాత్రమున అమితానందభరితుడై శిరిడీలో నివశించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనముకన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్ధించెను. తన కొరకును, ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. 10-12-1910 వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను (1)దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను. (2) చావడిలో శేజ్ (రాత్రి) ఆరతి ప్రారంభమయ్యెను. దీక్షిత్ వాడా పూర్తికాగానే 1911 వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి.

తరువాత, కోటీశ్వరుడును నాగపూరు నివాసియునగు బూటీ మరియొక పడ్డ రాతి మేడను నిర్మించెను. అతడు చాల ద్రవ్యము దీనికొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్ధకమయ్యెను. ఏలయన బాబాగారి భౌతికశరీర మందులో సమాధి చేయబడినది. దీనినే సమాధిమందిర మందురు. ఈ స్థలములో మొట్టమొదట పూలతోట యుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్ళు పోయుట మొదలగునవి చేసెడివారు.

ఇట్లు మూడు వాడాలు (వసతి గృహములు) కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతిగృహము కూడ లేకుండెను. అన్నిటికంటె సాఠెవాడా మొదటి రోజులలో అందరికి చాలా ఉపకరించుచుండెను.
నాలుగవ అధ్యాయము
సంపూర్ణము


| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు |
|శుభం భవతు |



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి