4, జూన్ 2009, గురువారం

మొదటి అధ్యాయము

శ్రీ సాయినాథాయ నమః

శ్రీ సాయిసచ్చరిత్రము

మొదటి అధ్యాయము
గురుదేవతా స్తుతి -
బాబా గోధుమలు పిండి విసరిన కథ - దాని తత్వము.

పూర్వసంప్రదాయానుసారము హేమడ్‍పంతు శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు .
1. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి యీ గ్రంథము జయప్రదముగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాధుడే సాక్షాత్తూ శ్రీగణేశుడని చెప్పుచున్నాడు .

2. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి యామె తననీ గ్రంధరచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు, శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను గానము చేయుచున్నారనియు చెప్పుచున్నారు.

3. తదుపరి సృష్టిస్థితిలయ కారకులగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి, శ్రీసాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు, సమర్థ సద్గురువులనియు, వారు మనలను సంసారమను నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు.

4. తరువాత తమ గృహదేవతమగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి, వారు కొంకణదేశములో వెలసిరనియు, ఆ భూమి పరశురాముడు సముద్రమునుండి సంపాదించినదనియు చెప్పుచు, వారి వంశ మూలపురుషుని స్తోత్రము చేసిరి.

5 అటుపిమ్మట వారి గోత్రఋషియగు భరద్వాజమునిని స్మరించెను. అంతేగాక, యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనకసనందనాదులు, సనత్కుమారుడు, శకుడు, శౌనకుడు, విశ్వామిత్రుడు, వసిష్టుడు, వాల్మీకి , వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మొ||న పలువురు మునులను, నివృత్తి , జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్ధనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారామ్, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించెను .

6. తర్వాత తన పితామహుడైన సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనమునుండి పెంచి పెద్దచేసిన మేనత్తకు, తన జ్యేష్ఠసోదరునకు నమస్కరించెను.

7. అటుపైన పాఠకులకు నమస్కరించి, తన గ్రంధమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్ధించెను .

8. చివరగా తన గురువు, దత్తావాతారమును అగు శ్రీసాయిబాబాకు నమస్కరించి , తాను వారిపై పూర్తిగా నాధారపడి యున్నానని చెప్పుచు, ఈ ప్రపంచము మిధ్య యనియు,బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు, నీ ప్రపంచములో నేయే జీవులందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికి నమస్కరించెను .

పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గలవరాలు చెప్పిన బక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట, హేమడ్‍పంతు ఈ క్రింది కధను చెప్పుటకు ప్రారంభించెను .

1910 సం || తదుపరి యొకనాటి ఉదయమున నేను శిరిడి మసీదులో నున్న శ్రీసాయిబాబా దర్శనము కొరకు వెళ్ళితిని. అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి యాశ్చర్యపడితిని. బాబా ముఖప్రక్షాళనము గావించుకొని గోధుమలు విసరుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనె పరచి, దానిపై తిరుగలి యుంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసికొని, కఫనీ (చొక్కా) చేతులుపైకి మడచి, పిడికెడు చొప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూచి నాలో నేను , "ఈ గోధుమపిండిని బాబా యేమిచేయును? ఆయనెందులకు గోధుమలు విసరుచుండెను? వారు భిక్షాటనముచే జీవించువారే! వారికి గోధుమపిండితో నేమి నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యము లేదే!" యని చింతించితిని. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడ నిట్లే యాశ్చర్యమగ్నులయిరి. కాని మాలోనెవరికి గూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యము చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామములో వ్యాపించెను. ఆబాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. నలుగురు స్త్రీలు ఎటులనో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి, వారే విసరుట ప్రారంభించిరి. వారు తిరుగలిపిడిని చేతపట్టుకొని, బాబా లీలలను పాడుచు విసరుట సాగించిరి . ఈ చర్యలను చూచి బాబాకు కోపము వచ్చెను. కాని, వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిఱునవ్వు నవ్విరి. విసరునప్పుడు స్త్రీలు తమలో తామిట్లనుకొనిరి. "బాబాకు ఇల్లుపిల్లలు లేరు. ఆస్తిపాస్తులు లేవు . వారిపై ఆధారపడినవారు, ఆయన పోషించవలసిన వారెవరును లేరు. వారు బిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసికొనుటకు గోధుమపిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమపిండితో నేమిపని? బాబా మిగుల దయార్ధ్రహృదయుడగుటచే మనకీ పిండిని పంచిపెట్టును కాబోలు." ఈ విధముగా మనమున వేర్వేరు విధముల చితించుచు పాడుచు విసరుట ముగించి , పిండిని నలుగు భాగములు చేసి యొక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసికొనుచుండిరి. అంత వరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు నిట్లనెను.

"ఓ వనితలారా! మీకు పిచ్చి పట్టినదా యేమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకొంటినాయేమి ? ఏ కారణముచేత పిండిని గొంపోవుటకు యత్నించుచున్నారు? సరే, యిట్లు చేయుడు. పిండిని తీసికొనిపోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు." అది విని యా వనితా లశ్చర్యమగ్నలయిరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి పిండిని చల్లిరి. నేనిదంతయు జూచి, శిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యము గలదనియు దానిని శాంతింపచేయుట కది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరినవి గోధుమలు కావనియు, వారు కలరా జాడ్యమును విసరి ఊరికవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామములోని ప్రజలందరు ఆనందిచిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగెను. దీని గూడార్ధమును తెలిసికొన కుతూహలము కలిగెను . గోధుమపిండికి కలరా జాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి యింకొకదానినెట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక యీ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పడుకొనవలయునని నిశ్చయించుకొంటిని. ఈ లీలను జూచి యిట్లు భావించుకొని హృదయానంద పూరితుడనయితిని. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడినది . అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వదాములచే గ్రంధము నిర్విఘ్నముగను, జయప్రదముగను పూర్తియైనది.

తిరగలి విసరుట - దాని వేదాంత తత్వము

తిరగలి విసరుటను గూర్చి శిరిడి ప్రజలనుకొనురీతియే కాక దానిలో వేదాంత భావము కుడా కలదు. సాయిబాబా శిరిడి యందు షుమారు 60 ఏండ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు తిరుగాలి విసరుచునే యుండిరి! నిత్యము వారు విసరునది గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ; మీదిరాయి భక్తి; చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకుగాని, అత్మసాక్షాత్కారమునకుగాని మొట్టమొదట పాపములను, కోరికలను తుడిచి వేయవలయును. అటుపిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను. అహంకారమును చంపుకొనవలయును .

ఇది వినగానే కబీరు కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ యొకతె తిరుగలిలో ధాన్యమును వేసి విసరుచుండెను. దానిని చూచి కబీరు యేడ్వసాగెను. నిపతినిరంజనుడను యొక సాధుపుంగవుడది చూచి కారణమడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను . "నేను కూడా ఆ ధాన్యమువలె ప్రపంచమను తిరుగలిలో విసరబడెదను కదా?" దానికి నిపతినిరంజను దిట్లు బదులు చెప్పెను.

"భయము లేదు! తిరుగలిపిడిని గట్టిగ పట్టుకొనుము. అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగ పట్టియున్నానో నీవును అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకుము. ఆంతరాత్మను జూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము. నీవు తప్పక రక్షింపబడెదవు."


మొదటి అధ్యాయము
సంపూర్ణము
| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు |
|శుభం భవతు |






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి