శ్రీసాయిసచ్చరిత్రము
ఆరవ అధ్యాయము
గురు కరస్పర్శ ప్రభావము-
శ్రీరామనవమి యుత్సవము - దాని ప్రారంభము, పరిణామము మొదలగునవి -
మసీదు మరమ్మతులు.
గురు కరస్పర్శ ప్రభావము
సంసారమను సాగరములో జీవుడనెడి యోడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురువనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నాకండ్ల యెదుట సాయిబాబా నిలచియున్నట్లు, నా నుదుట ఊదీ పెట్టుచున్నట్లు, నాశిరస్సుపై చేయివేసి యాశీర్వదించుచున్నట్లు పొడముచున్నరి. నా మనస్సు సంతోషముతో నిండిపోయి, కండ్లనుండి ప్రేమ పొగి పొరలుచున్నది. గురుహస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడ కాలనట్టి వాసనామయమైన సూక్ష్మశరీరము గురుకరస్పర్శ తగులగనే భస్మమైపోవును; అనేకజన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును. అధ్యాత్మికసంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడ నెమ్మది పొందును. శ్రీసాయి సుందరరూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును; కన్నుల నుండి అనందాశ్రువులు పొంగిపొరలును; హృదయము భావోద్రేకముతో యుక్కిరిబిక్కిరి యగును. 'నేనే తాన'ను (పరబ్రహ్మస్వరూపమను) స్ఫురణ మేల్కొని, ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. 'నేను నీవు' అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపజేయును. నేను వేదపురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నాసద్గురుమూర్తియే యడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును; నా సద్గురువైన శ్రీసాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా నా ముందు నిలచి, తన లీలలను తామే వినిపింప జేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీసాయి యాపాదమస్తకను కృష్ణునివలె గాన్పించును. భాగవతమో, ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగ అనిపించును. ఎవరితోనైన సంభాషించునప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను యేదైన వ్రాయ తలపెట్టినచో, యొక మాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదు. వారి యాశీర్వాదము లభించిన వేంటనే రచనా ధార యంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని యణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టుజేసి యాశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసినవానికి ధర్మార్ధకామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తిమార్గములనెడి నాలుగు త్రోవలు గలవు. అన్నింటిలో భక్తిమార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకుసాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీసాయిబాబా నొక్కివక్కాణించెడివాడు
స్వయసత్తాకమైన బ్రహ్మము, జగత్తును సృష్టించు నాబ్రహ్మము యొక్క శక్తి(మాయ), సృష్టి -- యను యీ మూడింటి గూర్చిన తత్త్వవిచారము చేసి, వాస్తవమునకీ మూడును నొకటియేయని సిద్ధాంతీకరించి, బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదానవాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు:
"నా భక్తుని యింటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి, భక్తిశ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే యారాధించువారి యొగక్షేమముల నేను జూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు! నీకేమైన కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తిప్రతిష్ఠలకై ప్రాకులాడుట మాని, దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచగౌరవమందుకొను భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవము యొక్క యాకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని యారాధనకొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఇల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుము. మనసును ధనసంపార్జనము, దేహపోషణ, గృహసంరక్షణము మొ||న విషయముల పట్ల సంచరించకుండ గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మదివహించి, శాంతముగను చింతారహిరముగను యుండును. మనస్సు సరియైన సాంగత్యములో నున్నదనుటకు నిదియే గుర్తు. చంచలమనస్కునకు స్వాస్థ్యము చిక్కదు."
బాబా మాటలుదహరించిన పిమ్మట గ్రంథకర్త శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. శిరిడీలో జరుగు నుత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల(1925 - పుట 197) పత్రికలో శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవము గురించి విపులముగ వర్ణింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది.
కోపర్గాంవ్లో గోపాల్రావు గుండ్ అనునతడు పోలీసు సర్కిలు ఇన్స్పెక్టరుగా నుండెను. అతడు బాబాకు గొప్పభక్తుడు. అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికి సంతానము కలుగలేదు. శ్రీసాయి యాశీర్వచనముచే అతనికొక కొడుకు బుట్టెను. ఆ ఆనందసమయంలో అతనికి శిరిడీలో 'ఉరుసు'* ఉత్సవము నిర్వహించవలెనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యాకోతేపాటీలు, దాదాకోతేపాటీలు, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయిభక్తుల ముందుంచెను. వారంతా దీనికి అమోదించిరి. బాబా యాశీర్వాదమును, అనుమతిని పొందిరి. ఇది 1897 లో జరిగేను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకులకర్ణి(కరణము) దానిపై నేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు.
________________________________________________________________________________________________________
===========================================================================================================================================================================================
*ఉరుసు = సమాధిచెందిన మహమ్మదీయ మహాత్ముల దుర్గాల (సమాధుల) వద్ద యేటేటా భక్తులు జరుపుకొను ఆరాధనోత్సవము.
==========================================================================================================================================================================================
________________________________________________________________________________________________________
కాని బాబా యాశీర్వదించి యుండుటచే, మరల ప్రయత్నించగా వెంటనే యనుమతి వచ్చెను. బాబా సలహా ననుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమినాడు జదుపుకొనమనుటలో హిందూ - మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశయము కాబోలు. భవిష్యత్సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును.
ఉత్సవము జరుపుటకు అనుమతయితే వచ్చెనుగాని, యితర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్నగ్రామమైన శిరిడీలో నీటి ఎద్దడి అధికముగా నుండెను. గ్రామమంతటికి రెండు నూతులుండెడివి. ఒకటి యెండాకాలములో నెండిపోవుచుండెను. రెండవదానిలోని నీళ్ళు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా, బాబా ఆ ఉప్పునీటిబావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగ ఆ ఉప్పునీరు మంచినీళ్ళుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరమునుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలినముగ అంగళ్ళు వెలసినవి. కుస్తీపోటీల కొరకేర్పాట్లు చేయబడినవి.
గోపాలరావు గుండున కొక మిత్రుడు గలడు. వాని పేరు దాము అణ్ణాకాసార్. అతనిది అహమద్నగరు. అతనికిని ఇద్దరు భార్యలున్నప్పటికి సంతానము లేకుండెను. అతనికి కూడ బాబా యాశీర్వాదముచే పుత్ర సంతానము గలిగెను. ఉత్సవము కొరకు ఒక జండా తయారు చేయించవలెనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబు నిమోన్కరును ఒక నగిషీజండా తెమ్మని కోరెను. ఈ రెండు జండాలను ఉత్సవముతో తీసికొనిపోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతినిప్పటికిని అవలభించుచున్నారు. బాబా తాము నివసించిన యా మసీదును 'ద్వారకామాయి' యని పిలిచెడివారు.
చందనోత్సవము
సుమారు అయిదేళ్ళ తరువాత ఈ యుత్సవముతోబాటు నింకొక ఉత్సవము కూడ ప్రారంభమయ్యెను. కొరాఃలా గ్రామమునకు చెందిన అమీరుశక్కర్ దలాల్ అను మహామ్మదీయభక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజాభజంత్రీలలో ఉత్సవము సాగించెదరు. ఉత్సవమూరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి (నింబారు) లోను, గోడలపైనను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు. మొదటి మూడు సంవత్సరములు ఈ యుత్సవమును ఆమీరుశక్కరు నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆసేవను కొనసాగించెను. ఒకేదినమందు పగలు హిందువులచే జండాయుత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము యే అఱమరికలు లేక జరుగుచున్నవి.
ఏర్పాట్లు
శిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబాభక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందురు వచ్చి ఈ యుత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఎర్పాట్లన్నియు తాత్యాకోతే పాటీలు చూచుకొనెడివాడు. ఇంటిలోపల చేయవలసినవన్నియు రాధాకృష్ణమాయి యను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయెడిది. ఆమె వారికి కావలసినయేర్పాట్లు చూచుకొనుటయేగాక, ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు, స్వయముగా ఆమె మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను మసీదుగోడలు బాబా వెలిగించు ధునిమూలముగా మసిపట్టియుండెడివి. మండుచున్న ధునితో సహా, మసీదులోని వస్తువులనన్నింటినీ తీసి బయట పెట్టి, మసీదుగోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా(దినము మార్చి దినము) చావడిలో పరుండునప్పుడు చేసెడిది. ఈపనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తిచేయుచుండెను. పేదలకు అన్నదానమనిన బాబాకు చాల ప్రీతి. అందుచేఈ యుత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి. భోజనపదార్ధములు, నిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగ వండబడెడివి. అనేకమంది సంపన్నులైన సాయిభక్తులు స్వచ్ఛందముగ పూనుకొని యీ సేవలో పాల్గొనుచుండెడివారు.
ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము
ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరుకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమినాడు వైభవముగా జరుగుచుండెను. రానురాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో యీ ఉత్సవమునకు సంబంధించి నొక మార్పు జరిగెను. శ్రీసాయినాధసగుణోపాసన గ్రంధకర్తయైన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ యనువాడు దాదాసాహబు ఖాపర్డే(అమరావతి)తో కలిసి నుత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బసచేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడా వసారాలో పండుకొనియుండెను ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకామహాజని పూజాపరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగనే భీష్మకు యొక క్రొత్త యాలోచన తట్టెను. వెంటనే కాకామహాజనిని దగ్గరకు పిలిచి అతనితో, "ఉరుసు యుత్సవమును శ్రీరామనవమినాడు చేయుననుటలో భగవదుద్దేశమేదియో యుండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాల ముఖ్యమైన పర్వదినము. కనుక యీ దినమందు రామజన్మోత్సవము యేల జరుపకూడ"దని యడిగెను. కాకామహాజనికి ఆ యాలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా యనుమతి సంపాదించుటకు అయత్తమయ్యిరి. కానీ, భగవస్సంకీర్తన చేయుటకు, అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లన, అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండటచే, అతడే దానిని సంకీర్తన చేయుటకు, కాకామహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట కేర్పాటయ్యెను. బాబా యనుమతి బొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా, "వాడలో నేమి జరుగుచున్నద"ని మహాజనిని ప్రశ్నించెను. బాబా యడిగిన ప్రశ్నలోని అంతరార్ధమును మహాజని గ్రహించలేక, యేమీ జవాబివ్వక మౌనముగ నుండెను. బాబాయదే ప్రశ్న భీష్మ నడిగెను. అతడు శ్రీరామనవమి యుత్సవము చేయవలయునను తమ యాలోచనను బాబాకు విరరించి,అందులకు బాబా యనుమతి నివ్వవలెనని కోరెను. బాబా వెంటెనే యాశీర్వదించెను. అందరు సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదు నలంకరించిరి. రాధాకృష్ణమాయి యొక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామజన్మోత్సవ వేడుక పారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనెను. అప్పుడే లెండీ నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి, మహాజనిని పిలిపించెను. రామజన్మోత్సవము జరుపుటకు బాబా యొప్పుకొనునో లేదో, యేమగునో యని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్లెను. అదియంతయు యేమని, అక్కడ ఊయల యెందుకు కట్టిరని బాబా యతనిని యడిగెను. శ్రీరావనవమి మహొ త్సవము ప్రారంభమైనదనియు అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మశీదులో నుండు భగవంతుని నిర్గుణస్వరూపమును సూచించు 'నింబారు' (గూడు) నుండి రెండు పులమాలలను తీసి, యొకటి మహాజని మెడలో వేసి, యింకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథాసంకీర్తనము ముగియగానే, బాజాభజంత్రీధ్వనుల మధ్య 'శ్రీరామచంద్రమూర్తికీ జై ' యను జయజయద్వానములు చేయుచూ, పరమోత్సాహముతో అందరూ యొకరిపైనొకరు 'గులాల్ '(ఎఱ్ఱ రంగుపొడి) జల్లుకొనిరి. అంతలో నొక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులలో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలమంది భయముతో పారిపోయిరి. కాని బాబా యొక్క సన్నిహితభక్తులు మాత్రము అవన్నియు తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన యాశీర్వాదములని గ్రహించి కదలక నక్కడనే యుండిరి. శ్రీరామజయంతినాడు రావణుడనే యహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీసాయిరూపములో నున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమేకదా యని భావించిరి. శిరిడీలో ఏదైన క్రొత్తది ప్రారంభించునపుడెల్ల బాబా కోపించుట యొక రివాజు. దీనిని తెలిసినవారు గమ్మున నూరకుండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ ఆరతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకనూ దానియవసరమున్నదనీ, కనుక దానిని విప్పవద్దనీ బాబా యతనిని వారించెను. రామనవమి మదుసటి దినమున జరుపు గోపాలకలోత్సవముతోగాని యుత్సవము పూర్తికాదను విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణజననము నాడు పాటించు 'కాలాహండి' యను ఉత్సవము జరిపిరి. కాలాహండి యనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఊప్పుకారము కలిపి వ్రేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు. రాలిపడిన యటుకులను భక్తులకు ప్రసాదముగ పంచి పెట్టెదరు. శ్రీకృష్ణపరమాత్ముడు ఈ మాదిరిగనే తన స్నేహితులగు గొల్ల పిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను. ఆ మరుసటిదినము ఇవన్నియు పూర్తియైన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలీవిధముగ జరిగిపోవుచుండగా, పగాటివేళ పతాకోత్సవము, రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగ జరిగినవి. ఈవిధముగ ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగ మారెను.
1913 నుండి శ్రీరామనవమి యుత్సవములోని యంశములు క్రమముగ హెచ్చినవి. చైత్రపాడ్యమినుంచి రాధాకృష్ణమాయి 'నామసప్తాహము' ప్రారంభించు చుండెను. భక్తులందరు వంతులవారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడ వేకువఝాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతట జరుగుటచే హరికధాకాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5,6 రోజులు ముందు 'ఆధునిక తుకారామ్' యని పిలువబడు బాలాబువ మాలీ యను సంకీర్తనకారుని కాకామహాజని యాధృచ్ఛికముగ కలియుట తటస్తించినరి. శ్రీరామనవమి వాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని శిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా, అనగా 1914లో, తన స్వగ్రామమైన సతారా జిల్లా
బృహద్ సిద్ధకవటె గ్రామములో ప్లేగు వ్యాపించియుండుటచేత బాలబువ సతార్కర్ సంకీరనకార్యక్రమములు లేక ఖాళీగా నుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా యనుమతి పొంది అతడు శిరిడీ వచ్చి, హరికథాసంకీర్తనము చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సం|| లో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి వాడు శిరిడీలో సంకీర్తన చేయు భాధ్యతను శ్రీదాసగణు మహరాజునకు బాబా అప్పగించుట ద్వారా యేటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగ పరిష్కరింపబడెను.
1912 నుండి ఈ యుత్సవము రానురాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు శిరిడీ తేనేత్రుట్టెయనలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను. కుస్తీపోటీలో ననేకమంది ప్రముఖ మల్లులు పాల్గొనుచిండిరి. పేదలకు అన్నసంతర్పణ విరివిగ జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే శిరిడీ యొక సంస్థానముగ రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రధము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దముము మొ|| నవి బహుకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడ వచ్చెను. ఇవన్నియు యెంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై యుండెడివారు. ఈ యుత్సవములో గమనింపవలసిన ముఖ్యవిషయమేమన హిందువులు, మహమ్మదీయులు యెట్టి అరమరికలు లేక కలసిమెలసి ఉత్సవములలో పాలుబంచుకొనెడివారు. ఈనాటి వరకు యొటుకంటి మతకలహములు శిరిడీలో తలెత్తలేదు. మొదట 5000 నుండి 7000 వరుకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగ యా సంఖ్య 75,000కు పెరిగినది. అంతపెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికి ఎన్నడూ అంటువ్యాధులుకాని, అల్లరులుగాని సంభవించలేదు!
మసీదుకు మరమ్మతులు
గోపాలరావుగుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించినవిధముగనే, మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబు చాందోర్కరుకు ఆ సేవ్ లభించినది రాళ్ళ తాపన కార్యము కాకాసాహేబు దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహాల్సాపతి కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని సాధించెను. బాబా చావడిలోపండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కుర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాల చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పై కప్పు వేయదలచెను. రాత్రియంతయు శ్రమపడి స్తంభములు నాటెడివరు. మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యది యంతయు జూచి కోపముతో వానిని పీకి పారవైచెడివారు.
ఒకసారి బాబా మిక్కిలి కోపొద్దీపితుడై, నాటిన ఇనుపస్తంభము ను ఒక చేతితో బెకలించుచు, రెండవచేతిలో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబావైపు చూచుటకుకూడా ధైర్యము చాలకుండెను. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోనుంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను. తాత్యాకూడ చాల భయపడెను. తాత్యాకేమి జరుగునున్నదో ఎవరికీ ఏమియు తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టునుండి తాత్యాను విడిపించుటకెవ్వరికిని ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠురోగియు బాబా భక్తుడు నగు భాగోజి శిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆజోలికి పోదలచిరో అందరికి యొకే గతి పట్టెను. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణ్దారుని పిలిపించి, వాని వద్దనుంచి యొక నగిషీ గరీపాగాను కొని, తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకాయన్నట్లు, దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క యీ వింతచర్యను జూచినవారెల్లరు నాశ్చర్యమగ్ములైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగ తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చుండి యత్యంత ప్రేపానురాగముతో మాట్లాడుచుండువారు. అంతలో నకారణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినపుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను.
ఆరవ అధ్యాయము

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి