4, జూన్ 2009, గురువారం

రెండవ అధ్యాయము


శ్రీ సాయినాథాయ నమః
శ్రీ సాయిసచ్చరిత్రము
రెండవ అధ్యాయము
గ్రంధరచనకు కారణము, పూనుకొనుటకు అసమర్ధత;
బాబా అభయము; వాడాలో వివాదము; 'హేమడ్‍పంతు' అను బిరుదు ప్రదానము;
గురువు యొక్క యావశ్యకత
గ్రంథరచనకు ముఖ్యకారణము

మొదటి యధ్యాయములో గోధుమలు విసరి యా పిండిని ఊరిబయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని.ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతరమహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్నీ గ్రంధము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలును చర్యలును మనస్సున కానందము కలుగజేయును; అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును; తుదకు పాపములను బోగొట్టును గదాయని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయమొదలిడితిని. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కమును న్యాయమును కాదు. అది మనకు సత్యమును,ఆధ్యాత్మికమునునైన మార్గమును జూపును.

గ్రంధరచనకు పూనుకొనుటకు అసమర్చట - బాబా అభయము
శ్రీసాయిసచ్చరిత్ర గ్రంధరచనకు తగిన సమర్ధతగలవాడను కానని హేమడ్‍పంతు భయపడెను. అతడిట్లనుకొనెను: "నా యొక్క సన్నిహితస్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు. నా మనస్సే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యొగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతారపురుషుల లక్షణముల నెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగియయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్తసముద్రముల లోతును గొలువవచ్చును. ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును. కాని యోగీశ్వరునిచరిత్ర వ్రాయుట బహుకష్టము . ఇది గొప్ప సాహసకృత్యమని కూడ నాకు తెలియును. " అందువలన నలుగురిలో నవ్వులపాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్ధించెను.

మహారాష్ట్ర దేశములోని ప్రధమ కవియు, యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వరమహారాజు యోగులచరిత్ర వ్రాసినవారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగులు చరిత్రలను వ్రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంధములు కొనసగునట్లు చేయుటకు యోగులనేకమార్గముల నవలంబిచెదరు. యోగులే యట్టిపనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కరణమాత్రునిగా నుంచి వారివారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరములో దాసగణు యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి . దాసగణు వ్రాసినవి భక్తలీలామృతమును సంతకధామృతమును మాత్రమే. ఆధునికయోగుల చరిత్రలు వీనియందు గలవు . భక్తలీలామృతములోని 31,32,33 అధ్యాయములందును, సంతకధామృతములోని 57 వ యధ్యాయమందును సాయిబాబా జీవితచరిత్రయు, వారి భోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచికలు 11,1,2 నందు ప్రచురితములు. చదువరులు ఈ యధ్యాయములు కూడ పఠించవలెను. శ్రీసాయిబాబా అద్బుతలీలలు బాంద్రా నివాసినియగు శ్రీమతి సావిత్రీబాయి రఘునథ్ తెండూల్కర్‌చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి.దాసగణు మహారాజుగారు కుడా శ్రీసాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు,. గుజరాతీ భాషలో అమీదాస్ భవాని మోహతా యను భక్తుడు. శ్రీసాయి కధలను ముద్రించినారు. సాయినాధప్రభ అను మాసపత్రిక శిరిడీలోని దక్షినభిక్ష సంస్థవారు ప్రచురించి యున్నారు . ఇన్ని గ్రంధములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి? దాని యవసరమేమి? - యనిఎవరైనను ప్రశ్నింపవచ్చును.

దీనికి జవాబు మిక్కిలి తేలిక! సాయిబాబా జీవితచరిత్ర సముద్రమువలె విశాలమైనది, లోతైనది. అందరు దీనియందు మునిగి భక్తిజ్ఞానములను మణులను వెలికితీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకమగు కథలు, లీలలు మిక్కిలి యాశ్చర్యమును కలుగజేయును. అవి మనోవికలత చెందినవారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి యానందము కలుగజేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదములవలె రంజకములును ఉపదేశకములునునగు బాబా ప్రబోధములు విని, వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి, అనగా బ్రహ్మైక్యయోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తకరూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలుగజేయును. అందుచేత బాబాగారి యత్మసాక్షాత్కారఫలితమగు పలుకులు, భోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే యీ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా మార్గము సవ్యమైనదనియు బాబా యిహపరసౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని.

నా యంతట నేను ఈ గ్రంధరచనకు బాబా యొక్క యనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అను వారు బాబాకు ముఖ్యభక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్దించమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి. "ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్చించుచున్నాడు 'నేను భిక్చాటనముచే జీవించు ఫకీరును. నా జీవితచరిత్ర వ్రాయనవసరము లేద'ని యనవద్దు! మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు. లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును. మీ యొక్క యనుమతి యశీర్వాదము లేనిదే యేదియు జయప్రదముగా చేయలేము. " అది వినినంతనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదము పెట్టి యాశీర్వదించెను. మరియు(శ్యామాతొ) నిట్లు చెప్ప దొడంగెను: "కధలను, అనుభవములను, ప్రోగు చేయమనుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకిగా వ్రాయమను. నేనుసహాయము చేసెదను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవితచరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను.వాడు తన యహంకారమును విడువవలెను. దానిని నా పాదములపైన బెట్టవలెను. ఎవరయితే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహయపడెదను. నా జీవితచర్యలకొరకే కాదు. సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడెదను. వాని యహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట ఆది మచ్చునకు కూడ లేకుండునప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తివిశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మనందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము . ఇతరుల యభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకుము .ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు."

వివాదమనగనే నన్ను 'హేమడ్‍పంతు' అని పిల్చుటకు కారణమేమో మీకు చెప్పెదనను వాగ్ధానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోవుచున్నను. కాకాసాహెబు దీక్షిత్, నానాసాహెబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను శిరిడీ పోయి బాబా దర్శనము చేయుమని బలవంతము చేసిరి. అట్లే చేసెదనని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా శిరిడీ ప్రయాణమున కడ్డుపడినది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను . నా స్నేహితుడు మందులు, మంత్రములన్నియు నుపయోగించెను గాని నిష్పలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతిని విని,"నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమియు సహాయము చేయలేనప్పుడు నేను శిరిడీ ఎలా పోవలెను?" అని భావించి శిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కానీ కానున్నది కాకమానదు. అది యీ క్రింది విధముగా జరిగెను.

నానాసాహెబు చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా యొకనాడాయన వసయీకి పర్యటనకై పోవుచుండెను. ఠాణానుండి దాదరుకు వచ్చి యచ్చట వసయీ పోవు బండికొరకు కనిపట్టుకొని యుండెను. ఈ లోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి, నన్ను పిలిపించి శిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నన సంతోషదాయకముగను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే శిరిడికి పోవ నిశ్చయించితిని. సామానులు కట్టుకొని శిరిడీ బయలుదేరితిని. బాంద్రా నుండి దాదరు వెళ్లి,అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలెనని అనుకొంటిని. అటులనే దాదరుకు టిక్కట్టు కొని, రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలు దేరుననగా , మహామ్మదీయుడొకడు నేను కూర్చొనిన పెట్టెలోనికి హడావిడిగా వచ్చి, నా సరంజామానంతయు జూచి, యెక్కడకు పోవుచుంటివని నన్ను ప్రశ్నించెను. నా యాలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదరు స్టేషనులో దిగవద్దనీ, ఎందుకనగా మన్మాడుమెయిలు దాదరులో ఆగదనీ, అదే రైలులో ఇంకనూ ముందుకుబోయి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహా చెప్పెను. ఈ చిన్న లీలయే జరుగకుండినచో నేననుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయము శిరిడీ చేరలేకపోయెడివాడను. అనేక సందేహములు కుడా కలిగి యుండెడివి. కాని నా యదృష్టవశాత్తు యది యట్లు జరుగలేదు. మరుసటి దినము సుమారు 9 -10 గంటలలోగా నేను శిరిడీ చేరితిని. శిరిడీ నా కొరకు కాకాసాహెబు దీక్షిత్ కనిపెట్టుకొని యుండెను.

ఇది 1910 ప్రాంతములో జరిగినది. అప్పటికి సఠేవాడా యొక్కటియే శిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి యుండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో, అప్పుడే మసీదునుండి వచ్చుచున్న తాత్యాసాహెబు నూల్కరు, బాబా వాడాచివరన ఉన్నారనియూ, మొట్టమొదట ధూళిదర్శనము చేసుకొనమని నాకు సలహా యిచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చుననెను . ఇది వినినతోడనే నేను పోయి బాబా పదములకు సాష్టాంగనమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగిపొరిలినది. నానాసాహెబు చాందోర్కరు చెప్పినదానికన్ననూ ఎన్నోరెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తిచెంది యాకలి దప్పికలు మరచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను. నాకు శిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికి నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి ఋణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞ్జప్తికి దెచ్చుకొని, వారికి నా మనసులో సాష్టాంగప్రణామము చేసితిని. నాకు తెలిసినంతవరుకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న యలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని .సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను.

తీవ్ర వాగ్వివాదము

నేను శిరిడీ చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు భాటేకును గురువు యొక్క యావశ్యకతను గూర్చి వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి యింకొకరికి ఎందుకు లొంగియుండవలెనని నేను వాదించితిని. "మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క యావశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి, మిక్కిలి యత్నముతో యీ జన్మదుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమియు చేయక సోమరిగా కూర్చొనువానికి గురువేమి చేయగలడు?" అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని. భాటే యింకొక వాదమును బట్టుకొని, ప్రారబ్దము తరపున వాదించుచు, " కానున్నది కాక మానదు. మహనీయులు కుడా నీ విషయములో నోడిపోయిరి.. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వముగాని యహంకారము కాని మీకు తోడ్పడవు" అనెను. ఈ వాదన యొక గంట వరకు జరిగెను. కాని యిదమిత్ధమని యేమియూతేలలేదు అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణవల్ల నా మనఃశ్శాంతి తప్పినది. దేహాత్మబుద్ది, అహంకారము లేకున్నచో వివాదమునకు తావు లేదని గ్రహించితిని. వేయేల, వివాదమునకు మూలకరణ మహంకారము.

ఇతరులతో కూడ మేము మసీదునకు పోగా, బాబా కాకాను బిలిచి యిట్లడిగెను: "వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమడ్‍పంతు ఏమనుచున్నాడు?"

ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాఠేవాడా మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై యుండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన యంతరాత్మపై నదికారియై యుండవచ్చును.

హేమడ్‍పంతు అను బిరుదునకు మూలకారణము

సాయిబాబా నన్నెందులకు 'హేమడ్‍పంతు'ని పిలిచెనని ఆలోచింపసాగితిని? ఇది 'హేమాద్రిపంతు' అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందినా యాదవవంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు; చతుర్వర్గ చింతామణి,రాజ ప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు; మోడీ భాషను, ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా? వానికి వ్యతిరేకబుద్ది గలవాడను, మేధాశక్తి యంతగా లేనివాడను. మరి, సాయిబాబా నాకెందుకీ 'బిరుదు' నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నిది నా యహంకారమును చంపుటకొక యమ్మనియు, నేనెప్పుడును అణుకువ నమ్రతలు కలిగి యుండవలెనని బాబా కోరికయయి యుండవచ్చుననియు గ్రహించితిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా యీ రీతిగా అభినందించియుండవచ్చని యనుకొంటిని.

భవిష్యచ్చరితను బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోళ్కరును 'హేమడ్‍పంతు' అనుట ) గొప్ప ప్రాముఖ్యము కలదనియు, భవిష్యత్తు తేలిసియే బాబా యట్లనెననియు భావించవచ్చును. ఏలయనగా హేమడ్‍పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగ నుంచెను. అదేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము,.ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీసాయి సచ్చరిత్ర యను గొప్ప గ్రంధమును రచించెను.

గురువుయొక్క యావశ్యకత

ఈ విషయమై బాబా యేమనెనో హేమడ్‍పంతు వ్రాసియుండ లేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గూర్చి తానూ వ్రాసికొనిన దానిని ప్రచురించెను. హేమడ్‍పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబావద్దకు వచ్చి, "శిరిడీనుండి వెళ్ళ వచ్చునా" యని యడిగెను. బాబా యట్లే యని జవాబిచ్చెను. "ఎక్కడకు" అని ఎవరో యడుగగా, "చాల పైకి" అని బాబా చెప్పెను. "మార్గమేది" యని దీక్షిత్ యడిగెను. "అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. శిరిడీ నుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గమధ్యమున నున్న యడవిలో పులులు, తోడేళ్ళు కల"వని బాబా బదులిడెను. "మార్గదర్శకుని వెంటదీసికొని పోయినచో" నని కాకాసాహెబు యడుగగా, "అట్లయినచో కష్టమే లేద"ని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు,పులులు,గోతులనుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును. లేద దారి తప్పి గుంటలలో పడిపోవచ్చుననెను. మసీదులో అప్పుడచ్చటనే యున్న దాభోళ్కరు తన ప్రశ్న కదియే తగిన సమధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా? యను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధలవల్లనే చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వసిష్ఠసాందీపులకు లొంగి యణకువతో నుండి యాత్మసాక్షాత్కారము పొందిరనియు, దానికి దృఢమైన మ్మకము(నిష్ఠ), ఓపిక (సబూరీ) యను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను.

రెండవ అధ్యాయము
సంపూర్ణము
| సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు |



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి